భారత్‌తో బంధానికి ప్రతీక.. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం!

  • ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు వెల్లడి
  • శివాజీ ధైర్యసాహసాలు, పాలనా విలువలు తమకు ఆదర్శమని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్య
  • ముంబైలో విగ్రహాన్ని తయారు చేసి ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరంలో ప్రతిష్ఠించనున్న వైనం
  • ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం 
భారత్‌తో స్నేహబంధాన్ని, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయాన్ని వెల్లడించింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తమ దేశంలోని ఒక ప్రధాన నగరంలో ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న చారిత్రక మైత్రికి, దృఢమైన బంధానికి ఈ చర్య ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొంది.

శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం (శివ రాజ్యాభిషేక్ దిన్) సందర్భంగా ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ ఈ అధికారిక ప్రకటన చేశారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, సమర్థవంతమైన నాయకత్వం, సుపరిపాలన, మత సామరస్యం మరియు నౌకాదళ వ్యూహాలు వంటి విలువలు ఇజ్రాయెల్ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ మైత్రీ భావంతోనే ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించినట్లు రెవాచ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు శివాజీ మహారాజ్ ఘనచరిత్రపై అవగాహన కల్పించడంతో పాటు, ఇరు దేశాల ప్రజల మధ్య బాంధవ్యాన్ని మరింత పెంపొందించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ముంబైలో సిద్ధం చేయనున్న ఈ విగ్రహాన్ని ఇజ్రాయెల్‌కు తరలించి, అక్కడి ఒక ప్రముఖ ప్రాంతంలో ఆవిష్కరించనున్నారు. కాగా, ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.                                

Chhatrapati Shivaji Maharaj
Israel
India Israel Relations
Shivaji Statue in Israel
Devendra Fadnavis
Mumbai Israeli Consulate

More Telugu News